సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం

నాపై అనర్హత వేటు పడే అవకాశమే లేదు: రఘురామ

అమరావతి : తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని వైస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. మీ బెయిల్ ను రద్దు చేయమని కోర్టును కోరితే రాజద్రోహం ఎలా అవుతుందని సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంతకాలం వైసీపీ నేతలు నిందలు వేశారని… సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు వారేమంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని… వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

తమ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని రఘురాజు అన్నారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై నిజాయతీ కలిగిన అధికారితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని జగన్ ఆదేశిస్తే… రాజీనామాలు చేసేందుకు ఎంపీలందరం సిద్ధమని చెప్పారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చాలా మందిపై మీరు వాడారని అంటున్నారని… అది వాడటానికి మీరు కేంద్ర నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/