వైఎస్‌ఆర్‌సిపి పాలనలో గ్రామీణాభివృద్ధి కనుమరుగైపోయింది: లోకేశ్

వైఎస్‌ఆర్‌సిపి పాలన తాలిబన్ల కంటే దారుణం.. నారా లోకేశ్

ysrcp-government-rule-more-appealing-than-that-of-taliban-says-nara-lokesh

మార్కాపురంః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర ఈరోజు కర్నూల్ జిల్లా మార్కాపురంలో కొనసాగుతుంది. ఈసందర్భంగా గ్రామస్తులు ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇళ్లకు ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామంలో ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు

గ్రామస్తుల ఫిర్యాదులపై స్పందించిన లోకేశ్..తాము అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని హామీఇచ్చారు. ఏపీ వైఎస్‌ఆర్‌సిపి పాలన తాలిబన్ల కంటే దారుణంగా ఉందని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని వ్యాఖ్యానించారు. టిడిపి కార్యకర్తలను వేధించిన పోలీసులకు ఉద్వాసన పలుకుతామని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.8600 కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతామని, సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు.