అక్టోబర్ 18 నుంచి షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టేందుకు ఆమె సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ 18 నుంచి పాదయాత్రను చేపట్టనున్నారు. చేవెళ్ల నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆమె తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంటును కొనసాగించబోతున్నారు.

అయితే, షర్మిల పాదయాత్రను చేపట్టబోతుండటం ఇదే తొలిసారి కాదు. గతంలో తన అన్న జగన్ జైలుకు వెళ్లిన సందర్భంగా ఆమె పాదయాత్రను చేపట్టారు. 2012లో ఉమ్మడి ఏపీలో 14 జిల్లాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా 3,112 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడిచారు. మరోసారి ప్రజాప్రస్థానం యాత్ర పేరుతో మరో పాదయాత్రను ఆమె చేపట్టారు. పులివెందులలో ప్రారంభమైన ఆమె యాత్ర… 2013 ఆగస్టు 4న శ్రీకాకుళంలో ముగిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/