వివేకా కేసు అప్రూవ‌ర్ ద‌స్త‌గిరి..త‌న భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న

నాకు ఏదైనా జ‌రిగితే ఎవ‌రిది బాధ్య‌త‌?… వివేకా ద‌స్త‌గిరి

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి త‌న భ‌ద్ర‌త‌కు సంబంధించి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీబీఐ అధికారుల సిఫార‌సు మేర‌కు కోర్టు ఆదేశాల‌తో త‌న‌కు పోలీసు సెక్యూరిటీ క‌ల్పించిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పిన ద‌స్త‌గిరి.. ఆ మేర‌కు త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లేద‌ని స్థానిక పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ఈ మేర‌కు శ‌నివారం నాడు త‌న భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ద‌స్త‌గిరి.. “నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వ‌డం లేదు. త‌న సెక్యూరిటీ కోసం లోక‌ల్ పోలీసుల‌ను ఇచ్చారు. ఆ లోకల్ పోలీసులు వారికి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తున్నారు. వెళుతున్నారు. ఏమైనా అడిగితే మా ప‌రిధి దాటి రాలేమ‌ని చెబుతున్నారు. ఈ చిన్న పాటి విష‌యాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. నాకు ఎక్క‌డ సెక్యూరిటీ ఇచ్చారో చెప్పాలి. నాకు ఏమైనా జ‌రిగితే ఎవ‌రిది బాధ్య‌త‌?” అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/