లోటస్‌పాండ్‌లో నేడు విద్యార్థులతో వైఎస్‌ షర్మిల సమావేశం

విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ

హైదరాబాద్‌: నేడు వైఎస్‌ షర్మిల లోటస్ పాండ్‌లో విద్యార్థులతో సమావేశం కానున్నారు. దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలతో ఇటీవల వరుసగా భేటీ అవుతున్న షర్మిలను నిన్న ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన పలువురు అభిమానులు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఆమెను కలిసిన వారిలో జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

టి.అంజయ్య కేబినెట్‌లో ఆర్థిక, హోంశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. నిన్న షర్మిల బంధువు ఒకరు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చిన ప్రభాకర్‌రెడ్డి నేడో, రేపో షర్మిళను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/