కేటీఆర్కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్
హైదరాబాద్: బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ ఇటీవల సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పేరును ప్రస్తావిస్తూ అభ్యంతరకరంగా పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే స్పందించిన మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ తన బిడ్డ శరీరాకృతిని విమర్శించడం సంస్కారం కాదని బీజేపీపై మండిపడ్డారు. ఆయనకు నెటిజన్ల నుంచి మద్దతు వస్తోంది.
దీనిపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కూడా స్పందిస్తూ కేటీఆర్కు మద్దతు తెలిపారు. పిల్లలను ఇలా వేధించడం సరికాదని తాను పిల్లలకు ఒక తల్లిగా చెబుతున్నానని అన్నారు. అలాగే, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలను ఓ రాజకీయ నాయకురాలిగా ఖండిస్తున్నానని ఆమె చెప్పారు. మహిళలను అవమానించినా, పిల్లలను కించపరిచినా నాయకులు రాజకీయాలకు అతీతంగా ఖండించాలని ఆమె అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/