టీఆర్ఎస్‌కి దమ్ముంటే తన పాదయాత్ర ఆపాలని షర్మిల సవాల్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..టిఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. దమ్ముంటే తన పాదయాత్ర ఆపాలని అన్నారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు రామేశ్వరం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పాలమూరు ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలని మండిపడ్డారు. వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే తనపై స్పీకర్‌కి ఫిర్యాదు చేశారన్నారు. తన పాదయాత్రను ఆపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని.. వారికి దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. తన పాదయాత్రతో బండారం బయటపడుతుందని వారికి భయం పట్టుకుందని, అందుకే పాదయాత్ర ఆపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును పూర్తిచేయాలని దీక్ష చేపట్టినందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేకే తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. వైఎస్సార్‌టీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు.