కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గు చేటు

మరణించిన రైతు కుటుంబాలకు పెన్షన్ ఇవ్వలేని ప్రభుత్వం ఇది: షర్మిల

హైదరాబాద్: సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటన్నారు. మీ సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని… ఇంగితం ఉంటే రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్పారు. బోర్లు వేసుకున్న రైతులకు దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని షర్మిల గుర్తుచేశారు. పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.

రైతుబంధు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి… విత్తనాలు, సబ్సిడీలు, యంత్రలక్ష్మి, నష్టపరిహారాలను బంద్ పెట్టారని అన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇదని విమర్శించారు. కేసీఆర్ రైతు ద్రోహి అని… రైతుల మరణాలకు ఆయనే కారణమని షర్మిల మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాక గల్లీల్లో దర్నాలు, ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చావు డప్పు కొట్టాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికేనని అన్నారు. ‘వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు’ అనేది మన నినాదం కావాలని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/