షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగింపు
గోపాలపేట : గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు తాను పోరాడతానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల ఈ రోజు ఈ డిమాండ్ తో దీక్ష ప్రారంభించారు. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువకుడు ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వనపర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగానే ఆమె ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.
దీక్ష ప్రారంభించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా.. నిరసన దినంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహిస్తుందని ప్రకటించారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల నిరాహార దీక్ష చేపట్టానని, ఉద్యోగుల పక్షాన పోరాటాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ఆ పోరాట స్ఫూర్తితో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతామని.. దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటన్నారు. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఇవాళ కొండల్ తల్లిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. కొండల్ తల్లి చెప్పిన మాటలు ఆవేదన కలిగించాయన్నారు. తన కొడుకును చదివించానని, అందుకే చనిపోయాడని.. చదివించకపోయుంటే చనిపోయేవాడు కాదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే చూడలేకపోయానన్నారు. ఇంతకన్నా అవమానకరమైన మాట ఏమన్న ఉంటుందా సీఎం కేసీఆర్ అని ప్రశ్నించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/