కేసీఆర్‭కు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్

YSRTP అధినేత్రి వైస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె పలు విమర్శలు చేసింది. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ‘సారు ఆయన కారు’.. అప్పులు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, మానవ అక్రమ రవాణాలో పోటీ పడుతోందని ఆమె ఆరోపించారు. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. 8 ఏండ్లలో 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరిని ఉద్ధరించారు అని ప్రశ్నించారు. రెండేండ్లలోనే మీరు చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడ పోయిందని ఆమె అన్నారు. తెచ్చిన అప్పులు దొర ఖజానా దాటి బయటకు రావని విమర్శించారు. కల్వకుంట్ల కమీషన్ రావు ధనదాహం తీరదంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో 4లక్షల కోట్ల అప్పులతో ఏ ఇంటికైనా 4లక్షల ప్రయోజనం జరిగిందా? తెచ్చిన అప్పులతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా? రైతుల రుణమాఫీ చేశారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారా? కనీసం పెన్షన్లకైనా ఇచ్చారా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ అండ్ కో కోసం చేస్తున్న అప్పులు తడిసి మోపెడై రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండగా మారాయన్నారు. తెచ్చిన అప్పులతో పాటు పెట్టిన మొత్తం ఖర్చు పై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేసారు.