నేను తెలంగాణ బిడ్డనే…
ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల
Khammam: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కేసీఆర్ దొర కాలికింద నలిగిపోతోందని, రాష్ట్రంలో ప్రశ్నించే పార్టీలు లేవని, కేవలం ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రకటించారు. శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో సంకల్ప సభలో షర్మిల మాట్లాడారు తెలంగాణ సాధించిన ఫలాలు ప్రగతిభవన్ గేటు దాటడం లేదని ,. ప్రాజెక్టుల రీడిజైన్లు పేరుతో నిధులు దండుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ జయంతి జూలై 8న తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానని చెప్పారు.
అధికారం, పదవులు ఉన్నా లేకపోయినా.. ప్రజల పక్షాన నిలిచి, వారి కోసం పోరాడి.. తిరిగి ప్రజాసంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు ఈ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘బరాబర్ నిలబడతా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దగా పడుతున్న ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. కల్వకుంట్ల కుటుబానికి తెలంగాణ బానిస అయిందని, దొర చెప్పింది వినడం తప్ప, ప్రశ్నించే వారు లేరని ఆమె అన్నారు. తెలంగాణలో లక్షా 91వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేవరకు, నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేవరకు పోరాడుదాం. నిరుద్యోగులకు అండగా ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/