వైరస్కు యువత అతీతం కాదు..డబ్ల్యూహెచ్వో
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు కోటి 70 లక్షలు దాటింది. అనేక దేశాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని దేశాల్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులకు యువతే కారణమని ఆ కేసులు పెరగడానికి యువత ప్రధాన కారణంగా నిలుస్తున్నారని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ తెలిపారు. యువత కూడా వైరస్ సంక్రమిస్తుందని, వారు వైరస్కు యువత అతీతం కాదని ఆయన అన్నారు.
యువకులను కూడా కరోనా వైరస్ బలహీనపరుస్తుందని, వారిని హాస్పిటల్లో వారాల పాటు ఉండే విధంగా చేస్తుందని, చంపేయగల శక్తి కూడా ఆ వైరస్కు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు చెప్పారు. ఎక్కువ శాతం కరోనా వైరస్ వృద్ధులను బలి తీసుకున్నదని, కానీ యువత కూడా ఆ వైరస్కు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అనేక దేశాల డేటాను పరిశీలిస్తే, 50 ఏళ్ల లోపు వారు హాస్పిటల్ పాలైన కేసులు చాలా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జెనీవాలో వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టెడ్రోస్ ఈ విషయాలను తెలిపారు. సామూహిక కలయికల వల్ల వైరస్ మరింత ఉదృతంగా మారుతుందని, అప్పుడు మహమ్మారిని అదుపు చేయడం కష్టం అవుతుందని డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/