అడ్డుగా ఉందని నాన్నమ్మను చంపిన మనవడు
నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. వృద్ధురాలైన నాన్నమ్మను ఓ మనవడు కిరాతకంగా హతమార్చిన సంఘటన భీంగల్ మడలం మెండోరా గ్రామంలో జరిగింది. వృద్ధురాలైన ఓ ముసలమ్మ వృద్ధాప్యంలో తనకు తోడుగా ఉంటాడని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. అయితే అతడే తన పాలిట మృత్యువుగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా ఒడ్డెర కాలనీలో లక్ష్మి(65) అనే వృద్ధురాలు తన మనవడు గంగాధర్(19) నివాసం ఉంటున్నారు. లక్ష్మి కొడుకు చనిపోవడంతో మనవడికి మూడు సంవత్సరాల వయసులోనే కోడలు గంగాధర్ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మనవడి ఆలనా పాలనా అంతా లక్ష్మి చూసుకుంది. అయితే ఆ యువకుడు జులాయిగా మారి స్నేహితులతో కలిసి తాగుడుకు బానిసగా మారాడు. నిత్యం స్నేహితులతో కలిసి ఇంట్లోనే కూర్చోని మద్యం సేవించేవాడు. ఇంట్లో ఇలాంటి పనులు చేయకు అని ఎన్నో సార్లు వారించింది. ఈ విషయంలో ఇద్దరికి తరచూ గొడవలు జరిగేవి కూడా. అయితే తన ఆనందానికి అడ్డుపడుతున్న నాన్నమ్మను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కర్కశంగా ఆలోచించాడు. పథకం ప్రకారం ఇంట్లో మద్యం తాగుతూ, పక్కనే ఉన్న ఇటుకలు, కర్రలతో నాన్నమ్మను తలపై కొట్టి ఇంట్లోంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/