పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం యోగి

యూపీ సీఎం యోగి పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఆదివారం ఆయన వారాణాసి నుంచి లఖ్​నవూకు వెళుతుండగా ఓ పక్షి హెలికాప్టర్​ను ఢీకొట్టింది. దీంతో టేకాఫ్​ అయిన నాలుగు నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకునే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్​ కౌషల్​రాజ్​ శర్మ తెలిపారు. ల్యాండ్​ చేసిన అనంతరం యోగి సర్కూట్​ హౌస్​లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బబత్​పుర్​ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లఖ్​నవూ బయలుదేరారు.

కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారాణాసి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు చేసిన యోగి.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం అభివృద్ధి పనులను పర్యవేక్షించి 9 గంటలకు లఖ్​నవూకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.