విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ను ప్రకటించారు. దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నాయి. ప్రతిపాదించిన ప్రతి ఒక్కరు తప్పుకోవడం తో విపక్ష పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాలు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో కొత్త అభ్యర్థి కోసం విపక్షాలు అన్వేషిస్తుండగా.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ను ఖరారు చేసారు.

ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇవాళే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. యశ్వంత్‌ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు. టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్‌ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.