చిక్కుల్లో షామీ సంస్థ..రూ.5,551 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

అక్రమ చెల్లింపులపై ఈడీ దర్యాప్తు దర్యాప్తులో వేగం

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షామీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా షామీకి చెందిన రూ.5,551.27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఫిబ్రవరిలో విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల మీద షామీపై ఈడీ దర్యాప్తు షురూ చేసింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయలను తాజాగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ లో షామీ 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. అయితే భారత్ లో వ్యాపారం నిర్వహిస్తూ, విదేశాల్లో ఉన్న మూడు సంస్థలకు రూ.5,551.27 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని రాయల్టీ పేరుతో చెల్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మూడు సంస్థల్లో ఒకటి షామీ గ్రూప్ కు చెందిన సంస్థ.

ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులకు షామీ ఇండియా భారత్ లో ట్రేడర్, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ భారత్ లోని వివిధ తయారీదారుల నుంచి మొబైల్ ఫోన్లను సేకరించి ఎంఐ బ్రాండ్ కింద విక్రయిస్తుంది. విదేశాల్లో మూడు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందడం లేదు. కానీ, ఆ మూడు సంస్థలకు పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు చేస్తోంది. దీనిపైనే ఈడీ దృష్టి సారించింది. షామీ తన గ్రూప్ సంస్థల మధ్య తప్పుడు లావాదేవీల కోసం పొంతనలేని పత్రాలు రూపొందించడమే కాకుండా, రాయల్టీ పేరుతో సొమ్మును విదేశాలకు తరలిస్తూ ఫెమా చట్టంలోని సెక్షన్ 4 నిబంధన ఉల్లంఘించిందిందని ఈడీ చెబుతోంది. అంతేకాకుండా, విదేశాల్లో ఉన్న సంస్థలకు చెల్లింపులు చేసే సమయంలో బ్యాంకులకు కూడా తప్పుడు సమాచారం అందించిందని ఈడీ ఆరోపిస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/