తమను బెదిరించే ప్రయత్నం చేస్తే వారి తలలు పగులుతాయి
అమెరికాను టార్గెట్ చేస్తున్న రీతిలో చైనా అధ్యక్షుడు ప్రసంగం
బీజింగ్ : చైనా లో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జాతి సమగ్రతను కాపాడుకునేందుకు చైనా ప్రజలు వెనుకడుగు వేయరన్నారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కేవలం సోషలిజం మాత్రమే చైనాను రక్షిస్తుందని, సోషలిజం మాత్రమే చైనాను అభివృద్ధిపథంలో నడిపిస్తుందని ఆయన అన్నారు. చైనాపై బెదిరింపులను సాగనివ్వమని, తమపై ఎవరు వత్తిళ్లు తెచ్చినా.. వారికి సమాధానం చెబుతామని జీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే వారి తలలు రక్తం చిందేలా చేస్తామన్నారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో తయారైన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్తో తుక్కుతుక్కు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రజలను మెచ్చుకున్న జిన్పింగ్.. వాళ్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు చెప్పారు. కానీ కమ్యూనిస్టు పార్టీ లేకుండా ఆ ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యం అయ్యేది కాదన్నారు.
కాగా, కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాల నేపథ్యంలో బీజింగ్ కళకళలాడింది. మిలిటరీ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు. శతఘ్నలను పేలుస్తూ సెట్యూల్ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. తయిమిన్ స్క్వేర్లో జరిగిన వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మాస్క్లు లేకుండానే జనం కనిపించారు. దాదాపు గంట సేపు జీ జిన్పింగ్ ప్రసంగించారు. దేశాన్ని ఆధునీకరించడంలో తమ పార్టీ సాధించిన ఘనతను ఆయన వెల్లడించారు. దేశాభివృద్ధిలో పార్టీ కీలకంగా నిలిచిందన్నారు.
తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/