మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ‘శ్రీశ్రీ’ కుమార్తె నియామకం

మద్రాస్ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన మాలా

మద్రాస్ : మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సిఫారసు చేసింది. వీరిలో మాలా, ఎస్. సౌందర్ పేర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో మాలాను అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ అడిషనల్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీశ్రీ- సరోజ దంపతుల నలుగురు సంతానంలో మాలా చిన్నవారు. మద్రాస్ లా కాలేజీ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో నమోదయ్యారు. ఆమె భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. మాలా దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు జయప్రకాశ్ మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/