వర్షాలు కురవాలని స్థానిక ఎమ్మెల్యే ఫై బురదతో స్నానం చేయించిన స్థానికులు

వర్షం అంటేనే కొన్ని రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా తెలంగాణ, ఏపీ , గుజరాత్ , మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడం తో భారీ వరదలు బీబత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడం తో పలు గ్రామాల్లోకి , పట్టణాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఇదిలా ఉంటె ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో వర్షాలు కురవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఫై బురదతో స్నానం చేయించారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అక్కడి ప్రజలు కొన్నేళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.

అందులో భాగంగా వరుణ దేవుడి దర్శనం త్వరగా కావాలని ఆశిస్తూ.. అక్కడి స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక ఛైర్మన్ పై బురద చల్లారు. ఇలా చేయడం వల్ల వర్షాలు వస్తాయని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. ఇది మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా ప్రాంతంలో జరిగింది. ఎంతగానో విశ్వసించే ఈ ఆచారంలో భాగంగా అక్కడి మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు మట్టి స్నానం చేయిస్తూ పాటలు పాడారు. ఏటా తాము ఈ సంబరాలు నిర్వహిస్తామని, దీని వల్ల ఇంద్ర దేవుడు సంతోషిస్తాడని తాము నమ్ముతామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పిల్లలు కూడా ఈ బురద నీటిలో స్నానం చేస్తారని.. దీన్నే వారి వ్యవహారిక భాషలో కల్ కలూటి అనే పేరుతో పిలుస్తారని తెలిపారు.