దేశ రాజధాని ఢిల్లీ లో మరో దారుణం : మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మత్తు మందు ఇచ్చి కారులో అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే…ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సదరు యువతికి తుషార్ శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం వచ్చేలా ట్రై చేస్తానని నమ్మ బలికాడు. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూ ఉందంటూ ఆమెకు తెలిపాడు. అతడు చెప్పినట్టే ఆమె తన డాక్యుమెంట్స్ తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు అక్కడకు చేరుకుంది.

ఈ క్రమంలో నిందితుడు ఆమెను కారులో ఎక్కించుకుని బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అతడిచ్చిన మంచీ నీళ్లు తాగాక తాను స్పృహ కోల్పోయానని సదరు యువతి తెలిపింది. ఆ తరువాత.. తుషార్ తనను బలవంతంగా కారులోకి తోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని , ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది.

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడటం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.