హైదరాబాద్ మందుబాబులకు బ్యాడ్ న్యూస్
హైదరాబాద్ మందుబాబులకు బ్యాడ్ న్యూస్..గణేష్ నిమజ్జనం సందర్భాంగా నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోపక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పట్లు పూర్తీ చేసింది.
నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్లను అందుబాటులో ఉంచామని, వీటితో పాటు మరో నాలుగు క్రేన్లను అదనంగా ఉంచామని మంత్రి తలసాని తెలిపారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా 19 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం ఆయా జిల్లాల నుంచి 7 వేల మంది పోలీసులను రప్పించామని, నిమజ్జన విధుల్లో 8,700 మంది శానిటేషన్ సిబ్బంది ఉంటారని మంత్రి చెప్పారు. ఆదివారం 40 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుందని, వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.