నా ఊపిరి ఉన్నంత వరకు మళ్లీ బిజెపితో కలిసి వెళ్లనుః సీఎం నితీశ్ కుమార్
బిజెపి నాయకత్వం అహంకార పూరితంగా ఉందని విమర్శ

పాట్నాః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు బిజెపితో మళ్లీ పొత్తు పెట్టుకునేది లేదని సోమవారం ప్రకటించారు. ‘నా ఊపిరి ఉన్నంత వరకు మళ్లీ బిజెపితో కలిసి వెళ్లను. మరణాన్నిఅయినా అంగీకరిస్తాను కానీ బిజెపితో కలిసి నడవను’’ అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, బిజెపినే బలవంతంగా తనను సీఎం చేసిందన్నారు. ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు.
బిజెపి ప్రస్తుత నాయకత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తుందన్న నితీశ్.. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీల హయాంను గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి, అద్వానీలను తాను గౌరవిస్తామని, ఎల్లప్పుడూ వారికి అనుకూలంగా ఉన్నామని చెప్పారు.