ఈసారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధ్యక్ష స్థానానికి పోటీపడరుః గెహ్లాట్
తిరువనంతపురంః కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీపడడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నో సార్లు రాహుల్ గాంధీని కోరానని, అయితే ఈసారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధ్యక్ష స్థానానికి పోటీపడరని రాహుల్ తనకు చెప్పినట్లు గెహ్లాట్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీపడేందుకు తాను నిర్ణయించినట్లు గెహ్లాట్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నామినేషన్ వేసే తేదీని వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. విపక్షాలు పటిష్టంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రస్తుతం దేశం ఏ స్థితిలో ఉందో గమనించవచ్చు అని తెలిపారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను అజయ్ మాకెన్,సోనియా గాంధీ చూసుకుంటారని గెహ్లాట్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/