సిఎం కెసిఆర్పై భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన ట్వీట్
హైదరాబాద్: తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందంటూ కెసిఆర్ సర్కార్పై బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఆదివారం తలపెట్టిన సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…సోమవారం ఉదయం విమానంలో ఢిల్లీకి వెనక్కిపంపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చంద్రశేఖర్ ఆజాద్..తెలంగాణ సిఎం కెసిఆర్ను టార్గెట్ చేస్తూ హిందీలో ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు. హైదరాబాద్ నుంచి తనను వెనక్కి పంపడమే కాకుండా…తనను అదుపులోకి తీసుకోవడానికి ముందు తన మద్దతుదారులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని, నిరసన తెలిపే ప్రజల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ముందుగా తమను కర్రలతో కొట్టారని, ఆ తర్వాత తనను అరెస్టు చేసి ఢిల్లీకి వెనక్కి పంపారని తెలిపారు. హైదరాబాద్లో తనకు జరిగిన అవమానాన్ని బహుజన సమాజం ఎప్పటికీ మరవబోదన్నారు చంద్రశేఖర్ ఆజాద్. హైదరాబాద్కు త్వరలోనే మళ్లీ వస్తానంటూ ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/