ఈడీకి సహకరిస్తా – మంత్రి గంగుల
ఈరోజు ఉదయం నుండి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తరుణంలో దుబాయ్ పర్యటన కు వెళ్లిన మంత్రి గంగుల..ఈడీ సోదాల నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు.
ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఈ సందర్భాంగా గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులకు ఇంటి తాళాలు తీయమని చెప్పింది తానే అని తెలిపారు. ఇంట్లోని ప్రతి లాకర్ను ఓపెన్ చేసి చూసుకోమని చెప్పానన్నారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో దర్యాప్తు అధికారులే చెప్పాలన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని చెప్పారు.
బయటి దేశాల నుంచి డబ్బులు హవాలా మార్గంలో తెచ్చామా అనేది ఈడీ.. డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ విభాగం చూస్తోందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి గంగుల తేల్చి చెప్పారు.