కాలిఫోర్నియాలో కాలిబూడిదవుతున్న ఇళ్లు, వాహనాలు

రంగంలోకి 200 మంది ఫైర్ ఫైటర్లు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం విధ్వంసం సృష్టిస్తోంది. పొడి వాతావరణానికి తోడు బలమైన గాలులు తోడవడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. కాలిబూడిదవుతున్న ఇళ్లు బూడిద కుప్పలను తలపిస్తున్నాయి. కార్చిచ్చు ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్‌లోని భవనం, 25 మొబైల్ హౌస్‌లు, 16 రిక్రియేషన్ వాహనాలు తగలబడిపోయాయి. ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరోవైపు, కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. దావానలం కారణంగా ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని, శాన్ జోకిన్ కౌంటీలో మాత్రం ఓ వ్యక్తి గాయపడ్డాడని, ఐదు మొబైల్ హౌస్‌లు ధ్వంసమయ్యాయని తెలిపారు. సౌత్ శాంటా బార్బారా కౌంటీ కోస్ట్‌లో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. సోమవారం అమాంతం ఎగసిపడిన కార్చిచ్చు మంగళ, బుధవారాల్లో కొంత నెమ్మదించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/