తనను పట్టించుకోవడం లేదని భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య..

భర్త యోగక్షేమాలు చూడాల్సిన భార్యే..భర్తఫై మరుగుతున్న నూనె పోసి తన కసి తీర్చుకుంది. గత కొద్దీ రోజులుగా తనను పట్టించుకోవడం లేదని ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదో హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…

విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌లాల్ (50) మటన్ వ్యాపారి. పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ల క్రితం భార్య రేణుక (40), కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. జియాగూడ కబేళాలో పనిచేస్తూ దరియాబాగ్‌లో ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా గిరిధర్‌లాల్ భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకున్న గిరిధర్‌లాల్ ..భార్యను దూరం పెట్టడం చేసాడు. ఈ క్రమంలో ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ మూడు రోజుల క్రితమే తన వద్దకు వచ్చినట్టు రేణుక ఆరోపించింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. నిన్న మరోమారు ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన రేణుక వంటింట్లోకి వెళ్లి కడాయిలో ఉన్న మరుగుతున్న నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. తీవ్రంగా గాయపడిన గిరిధర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.