రసాయనాల పిచికారీ పై డబ్ల్యూ హెచ్ ఓ ఆందోళన
జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిక
కరోనా వైరస్ నుంచి తమని తాము కాపాడుకోవడానికి దాదాపు అన్ని దేశాలు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్నాయి.
భారతదేశంలో కూడా దీని వినియోగం ఎక్కువగానే ఉంది. వలస కూలీలను మూకుమ్మడిగా కూచోబెట్టి రసాయనాలను పిచికారీ చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్య్లూహెచ్ఓ) ఈ పరిణామంపై స్పందించింది. ఆందోళన వ్యక్తం చేసింది.
ఆరోగ్యశాఖాధికారులు నిలువెల్లా ప్రత్యేక రక్షిత సూట్లు ధరించి వ్యక్తుల మీద రసాయనాలు పిచికారీ చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది.
ఇండొనేషియా లాంటి దేశాల్లో అయితే రసాయనాలను స్ప్రే చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అలా పిచికారీ చేసినప్పుడు వెలువడే రసాయనం గాలిలో ఎక్కువసేపు ఉండిపోతుంది.
దీనివల్ల మనుషులకు ఇతరత్రా జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్ధ తెలిపింది.
కరోనా వైరస్ దీని వల్ల నశించడం జరగకపోగా ఇతరేతర హాని జరగొచ్చని హెచ్చరిస్తున్నది. చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావచ్చని తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/