మలేరియా వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం

వాషింగ్టన్‌ : పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా అవసరమైన ప్రతి దేశానికి చేరాలన్న డబ్ల్యూహెచ్‌ఓ కల తీరనున్నది. దీని అనంతరం మలేరియాను నియంత్రించే చర్యల్లో ఈ టీకాను చేర్చడంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.

చిన్నారుల్లో మలేరియాను నిర్మూలించేందుకు ఆర్టీఎస్‌ ఎస్‌ వ్యాక్సిన్ ఉపయోగించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలుపడంతో.. తొలుత ఘనా, కెన్యా, మలావి వంటి ఆఫ్రీకన్‌ దేశాల్లో పైలట్‌ ప్రోగ్రాం క్రింద ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దాదాపు 23 లక్షల మంది చిన్నారులకు టీకాలు ఇస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోతీ చెప్పారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాల ప్రకారం, మలేరియా వ్యాక్సిన్‌ సురక్షితం. 30 శాతం తీవ్రమైన కేసులను నిరోధించవచ్చు. ఈ టీకా ఇచ్చిన పిల్లల్లో మూడింట రెండు వంతుల మంది దొమతెరలు లేనివారే ఉన్నారు. మలేరియా వ్యాక్సిన్‌ను నివారించేందుకు ఇతర టీకాలు లేదా ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కూడా వెల్లడైంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/