వాట్సాప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీనామా

రెండు వారాల క్రితమే మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా

WhatsApp India head and Meta India public policy director resign

న్యూఢిల్లీః మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ చీఫ్ రాజీవ్ అగర్వాల్ కంపెనీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మెటా నిర్ధారించింది. అలాగే, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. రాజీవ్ అగర్వాల్‌కు వేరే అవకాశాలు రావడం వల్లే ఆయన సంస్థను వీడినట్టు మెటా ఇండియా పేర్కొంది. ఆయన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది.

మరోవైపు, వాట్సాప్‌కు తొలి హెడ్‌గా పనిచేసిన అభిజిత్ రాజీనామాపై ఆ సంస్థ హెడ్ విల్ క్యాచ్‌కార్ట్ స్పందించారు. సంస్థకు ఆయన అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన వ్యవస్థాపక డ్రైవ్ తమ బృందం కొత్త సేవలను అందించడంలో విశేషంగా సాయపడిందని ప్రశంసించారు. కాగా, బోస్ ఫిబ్రవరి 2019లో వాట్సాప్ తొలి కంట్రీ హెడ్‌గా నియమితులయ్యారు. కొంత విరామం తర్వాత తిరిగి వ్యవస్థాపక ప్రపంచంలో చేరుతానని లింక్డిన్ ద్వారా ఆయన తెలిపారు. పదవి నుంచి తప్పుకోవడం అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందేనని పేర్కొన్నారు.

కాగా, వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రల్‌ను మెటా ఇండియాలోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా నియమించినట్టు టెక్ దిగ్గజం పేర్కొంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీరు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/