తెలంగాణలో అతి పెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

కెసిఆర్‌ ఈ పని చేయలేకపోతున్నారు కాబట్టి బిజెపి చేస్తుంది..బండి సంజయ్

bandi-sanjay

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించుకున్న అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. అలాగే, అంబేదర్క్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పించి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..”తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోంది.. కాబట్టి కనీసం అంబేద్కర్ విగ్రహాల వద్ద అలంకరణ చేయాలన్న విషయాన్ని కూడా సిఎం కెసిఆర్‌ పట్టించుకోవట్లేదు. మేము తెలంగాణలో అతి పెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కెసిఆర్ ఈ పని చేయలేకపోతున్నారు కాబట్టి బిజెపి చేస్తుంది. బిజెపి 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట చేసే పని దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేయడమే. అంబేద్కర్ విగ్రహం ముందు, ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహంపై అప్పట్లో కెసిఆర్ ఇచ్చిన మాట తప్పారు. ఈ విషయాన్ని కెసిఆర్‌కు గుర్తు చేస్తున్నాను” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల ఘాట్ లను కూడా కూల్చివేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన బిజెపి కూడా అంతే స్థాయిలో జవాబు చెప్పింది. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పీవీ ఘాట్‌కు వెళ్లారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/