ఈసారి 100 సీట్లు రావడం ఖాయం – కేసీఆర్

మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు సాదించబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకల సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని , తద్వారా, ముందస్తుపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు. క్యాడర్‌లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని స్పష్టం చేశారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం అని కర్తవ్య బోధ చేశారు. సరిగా పనిచేయని ఎమ్యెల్యేలను ఉపేక్షిస్తానని అనుకోవద్దని హెచ్చరిక చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నామని, ఈసారి 100 సీట్లు వస్తాయన్న ధీమా ఉందని పేర్కొన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్దేశించారు.