పార్లమెంట్ గేట్ వద్ద విపక్షాల నిరసన
న్యూఢిల్లీః అదానీ అంశంపై పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేపట్టాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈరోజు కూడా పార్లమెంట్లోని గేటు నెంబర్ 1 వద్ద.. భారత రాష్ట్ర సమితితో పాటు అన్ని విపక్ష పార్టీలు నిరసనలో పాల్గొన్నాయి. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని కోరుతూ ఎంపీలు నినాదాలు చేశారు. రెండో దఫా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు వరుసగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోక్సభ, రాజ్యసభలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే రద్దు అవుతున్నాయి. నేడు కూడా రెండు సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, ప్రతిష్టంభన తొలగించేందుకు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధనకర్ ఇవాళ విపక్ష ఫ్లోర్ లీడర్లతో భేటీ అయ్యారు. ఆయన తన ఛాంబర్లో వారితో మాట్లాడారు. సభను సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ముచ్చటించారు. కానీ రాజ్యసభను ఈరోజు కూడా యధావిధిగా వాయిదా వేశారు.