భారత్ ఎప్పుడూ మా వెన్నంటే ఉంది
భారత్ సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం..చైనా రాయబారి సున్ వీడోంగ్
బీజింగ్: చైనా ప్రస్తుతం కొవిడ్-19తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చైనాకు ఎన్నో దేశాలు తమదైన మార్గంలో సహాయం అందించాయి. భారత్ నుంచి చైనాకు భారీ ఎత్తులో వైద్య పరికరాల సరఫరా జరుగుతోంది. ఇందుకు కృతజ్ఞతగా చైనా తమకు సాయమందించిన 57 దేశాల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో భారత్ పేరు లేకపోవడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. పలువురు భారతీయులు అక్కసు వెళ్లగక్కారు. దీంతో జరిగిన పొరబాటును గుర్తించిన చైనా రాయబారి సున్ వీడోంగ్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కోవిడ్ విషయంలో భారత్ అందిస్తున్న సాయాన్ని కొనియాడారు. కష్టకాలంలో భారత్ ఎప్పుడూ మా వెన్నంటే ఉందని, వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని సున్ వీడోంగ్ స్పష్టం చేశారు. చైనా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ భారత్ స్నేహ హస్తం అందిస్తూనే ఉందని వీడోంగ్ అన్నారు. 2003లో సార్స్ వైరస్ ప్రబలినప్పుడు కూడా భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/