వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేం : సుప్రీంకోర్టు

ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒత్తిడి చేయలేమని, ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. సమాజ హితం కోసం పాలసీ తయారు చేసి, అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది.

వ్యాక్సిన్ వేయించుకోలేదనే కారణంతో వ్యక్తులను పబ్లిక్ ప్రదేశాలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్గనైజేషన్లు అనుమతించడం లేదని… ఇది సరికాదని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను అమలు చేయడాన్ని ఆపేయాలని ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ డాక్టర్ జాకోబ్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం… వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకోవాలని ఆదేశించలేమని తీర్పును వెలువరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/