చిత్తూరు జిల్లాలో పుట్టుంటే.. రా చూసుకుందాం

నారా లోకేశ్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్

అమరావతి : టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఆ తర్వాత పట్టాభి ఇంటితో పాటు రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైస్సార్సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మరోవైపు టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పరుషపదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీడీపీ నేత నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. ‘దమ్ముంటే చూసుకుందాం రా’ అంటూ ఛాలెంజ్ చేశారు.

సీఎం జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా? అని అనిల్ మండిపడ్డారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని అన్నారు. మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే… రా చూసుకుందామని అన్నారు. తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని… ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని… కాన్వాయ్ ని కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఉండగలరా? అని అడిగారు. వైస్సార్సీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/