భారత్‌కు ఉన్న భయాలే మాకూ ఉన్నాయి: జర్మనీ

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్

న్యూఢిల్లీ: తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌ను పలు ఉగ్రవాద సంస్థలు అడ్డాగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భారతదేశం చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో తమకు కూడా భారత్‌కు ఉన్న భయాలు, అనుమానాలే ఉన్నాయని జర్మనీ చెప్పింది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో చిన్న స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రసంస్థలు లేకుండా చూడాలని తాలిబన్లకు సూచిస్తున్నాం. పాకిస్థాన్ వంటి దేశాలైనా లేక ఆఫ్ఘనిస్థాన్ స్వయంగా అయినా సరే ఉగ్రవాదులను పెంచి పోషించకూడదని తాము గట్టిగా చెప్పినట్లు లిండ్నర్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ పొరుగుదేశాలకు కూడా తాము ఇదే సందేశం ఇస్తున్నట్లు చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ విజయం తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాదం పెట్రేగిపోయే ప్రమాదం ఉందని భారత్ పలుమార్లు హెచ్చరించింది. తమ దేశం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోందని లిండ్నర్ అన్నారు. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు పెరగకుండా చూసుకోవాలి. ఇదే తాలిబన్లతో చర్చలకు మేం విధించిన మొట్టమొదటి నిబంధన’ అని ఆయన తెలిపారు.

కాగా, ఇటీవల అమెరికా పర్యటనలో కూడా ప్రధాని మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆఫ్ఘన్‌లో పాకిస్థాన్ పాత్రపై చర్చించిన ఆయన ఈ విషయంలో పర్యవేక్షణ అవసరమని సూచించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/