భ‌ద్రాచ‌లం వ‌ద్ద మరోసారి పెరుగుతున్న నీటిమట్టం.. మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండడం తో మరోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్ర‌స్తుతం గోదావ‌రి నీటిమ‌ట్టం 43.50 అడుగులకు చేరడం తో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావ‌రిలో ప్ర‌స్తుతం 9.55 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహం కొసాగుతోంది. ఈ నేప‌థ్యంలో గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

గత నెలలో భద్రాచలం వద్ద గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. 70 అడుగుల మేర గోదావ‌రి ప్రవహించింది. దీంతో భద్రాచలం లోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇక ముంపు గ్రామాలైతే దాదాపు వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ఆ గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఇప్పుడు మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 48 అడుగులకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. 53 అడుగుల దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, రెడ్ అలెర్ట్ ప్రకటించ‌నున్నారు అధికారులు.