జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు జనగామ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద ఎర్రబెల్లి దయాకర్‌ రావును అడ్డుకునేందుకు వీఆర్‌ఏలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీఆర్‌ఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది.

అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి.. గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇందుకు వ్యతిరేకంగానే నేడు మంత్రిని వీఆర్‌ఏలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

జనగామ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని RTA ఆఫీస్ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్ కట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. 

ఇదిలా ఉంటె వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై జనగామ కలెక్టరేట్ లో సంబధిత జిల్లా అధికారులతో ఎర్రబెల్లి సమీక్షించడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.