జయలలిత వైద్యం విషయంలో నా ప్రమేయమేమీ లేదు..ఏ విచారణకైనా సిద్ధమే: శశికళ

తనపై ఆరోపణలను ఖండించిన శశికళ

vk-sasikala-denies-arumughaswamy-commission-report-on-jayalalithaas-treatment

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వైద్యం విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై వీకే శశికళ తీవ్రంగా స్పందించారు. జయలలితకు వైద్యం విషయంలో తన ప్రమేయమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. రిపోర్టులో తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ఆంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం రాలేదని వివరించారు.

చికిత్స విషయంలో ఎయిమ్స్ వైద్యుల బృందం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అవసరమని గానీ, జయలలితను విదేశాలకు తరలించాలని గానీ వైద్యులు నిర్ణయించలేదన్నారు. జయలలిత తనకు సన్నిహిత మిత్రురాలని శశికళ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈమేరకు బుధవారం శశికళ మూడు పేజీల వివరణ లేఖ రాశారు. జయలలిత మృతిపై ఎలాంటి విచారణ జరిపినా సహకరించేందుకు సిద్ధమని అందులో పేర్కొన్నారు.

జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఆరోపణలపై మంగళవారం శశికళ లాయర్ స్పందించారు. జయలలిత అనారోగ్యం పరిస్థితిపై, తనకు అందించాల్సిన చికిత్స విషయంపై ఎయిమ్స్ వైద్యుల బృందం ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అందులో తన క్లయింట్ శశికళ ప్రమేయం ఎంతమాత్రమూలేదని తేల్చిచెప్పారు. బెడ్ పై ఉన్న తన మిత్రురాలిని దగ్గరుండి చూసుకోవడం తప్ప చికిత్స విషయంలో శశికళ జోక్యం చేసుకోలేదని వివరించారు. జయలలితకు ఆంజియోగ్రామ్ పరీక్ష చేయాలని వైద్యులు నిర్ణయిస్తే శశికళ అడ్డుకున్నారన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.