వివేకా హత్య కేసు : నేడు సిబిఐ ముందుకు వైఎస్ భాస్కర్రెడ్డి
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్రెడ్డి ఈరోజు శనివారం సిబిఐ ముందు హాజరుకాబోతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని శుక్రవారం సిబిఐ అధికారులు విచారించడం జరిగింది. ఈ రోజు అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించబోతోంది. కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని విచారించనుంది. సీబీఐ విచారణకు హాజరు కావడానికి భాస్కర్ రెడ్డి పులివెందుల నుంచి కడపకు బయల్దేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు హాజరవుతారు. ఈ నెల 23న విచారణకు రావాలని గతంలోనే నోటీసులు జారీ చేయగా.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా హాజరు కాలేనని భాస్కర్రెడ్డి తిరిగి సీబీఐ కి లేఖ రాశారు.
వివేక హత్య కేసులో రెండో సారి విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగున్నర గంటలపాటు విచారించింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్ ఆ హత్య జరిగిన రోజు తన ఇంట్లో ఎందుకున్నారని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అడిగినట్లు తెలిసింది. అది యాదృచ్ఛికంగానే జరిగిందా అని ప్రశ్నించినట్లు సమాచారం. మరో నిందితుడు గంగిరెడ్డితో తనకున్న సంబంధాలేంటి, ఆయనతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనీ ప్రశ్నలు సంధించినట్లు వినికిడి.