జగన్ పై విష్ణువర్థనరెడ్డి విమర్శలు

కేంద్రానికి జగన్ రాస్తున్న లేఖలు ప్రేమ లేఖల్లా ఉన్నాయి

అమరావతి : కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం యథేచ్చగా వాడటం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్తుండగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని… అయినా ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ రాస్తున్న లేఖలు ప్రేమలేఖల మాదిరి ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రానికి లేఖలు రాసి వివాదం నుంచి తప్పుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

శ్రీశైలం డ్యామ్ లో నీరు అడుగంటినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందని… అయినా జగన్ నోరెత్తడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వానికి వైసీపీ నేతలు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాల కార్పొరేషన్ల వల్ల ఏ కులానికి న్యాయం జరగలేదని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/