నిరసనలతో రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు

విశాఖ ఉక్కును వందశాతం అమ్మేస్తామన్న నిర్మల
కేంద్ర ప్రకటన ప్రతులను దహనం చేసిన కార్మికులు

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు కార్మికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆందోళనను మరింత ఉద్ధృతం చేసిన కార్మికులు రాత్రి నుంచి రోడ్లపైనే నిరసన కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కేంద్ర ప్రకటనతో ఉన్న ప్రతులను దహనం చేశారు. నేడు విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

నిన్న లోక్‌సభలో వైస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నలకు మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని, వంద శాతం అమ్మేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్టు స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/