మరో సంచలన నిర్ణయం తీసుకున్న కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రీసెంట్ గా టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14వ సీజన్‌ ఐపీఎల్‌ ముగిశాక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేసినట్టు కూడా వెల్లడించాడు. ఈ మేరకు విరాట్‌ మాట్లాడిన వీడియోను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘ఆర్‌సీబీ ఫ్యామిలీ, ఏళ్లుగా బెంగళూరు జట్టుకు అండగా నిలుస్తున్న అద్భుతమైన ఫ్యాన్స్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు సాయంత్రం ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభానికి ముందు నా జట్టు సహచరులతో మాట్లాడా. కెప్టెన్‌గా ఇది నా ఆఖరి ఐపీఎల్‌. సారథ్యం నుంచి తప్పుకోవాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యానికి సైతం తెలియజేశా. ప్రపంచ కప్‌ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలుసు. వర్క్‌లోడ్‌ను తగ్గించుకొని, పునరుత్తేజం పొందడం ద్వారా కొత్త శక్తితో ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకున్నా. వచ్చే ఏడాది భారీ స్థాయిలో వేలం జరగనుండడంతో ఆర్‌సీబీ జట్టు పరివర్తన దిశగా సాగనుంది. అయితే ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్‌ వరకూ ఆర్‌సీబీతోనే ఉంటానని యాజమాన్యానికి స్పష్టంజేశా. కెప్టెన్‌గా జట్టుతో నా తొమ్మిదేళ్ల పయనం అద్భుతంగా సాగింది. ఈక్రమంలో నాకు మద్దతుగా నిలిచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్‌సీబీతో నా పయనంలో ఇదో చిన్న హాల్ట్‌ మాత్రమే. కానీ గత కొన్ని సంవత్సరాల మాదిరే భవిష్యత్తులో ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు ఉన్నప్పటికీ కోహ్లీ సార్థథ్యంలోని ఆర్‌సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్‌ కప్పు గెలవలేకపోయింది. 2009, 2011, 2016లో ఆర్‌సీబీ ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌గానే నిలిచింది. ఇక, కోహ్లీ తర్వాత ఆర్సీబీ పగ్గాలు ఎవరు చేపడతారనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొనింది.