ఏపీలో మరో వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు

village-volunteer-rapes-minor-girl

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన , పోలీసులు ఎంతటి కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సదరు బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లి నివాసం ఉంటుండగా.. బాలిక తన అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో వాలంటీర్‌గా పని చేస్తున్న రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. గత మూడు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బయట చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే వాలంటీర్ నుంచి వేధింపులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.