సీఎం కేసీఆర్ ఫై విజయశాంతి ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫై మరోసారి నిప్పులు చెరిగారు బిజెపి మహిళా నేత విజయశాంతి. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా పేద‌ల‌కు ఆన్యాయ‌మే జ‌రుగుతోంది. తెలంగాణ‌లో వ‌రుసగా మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ‌లో కేసీఆర్ నిర‌కుంశ పాల‌న‌ రాజ్యమేలుతుందంటూ మండిపడ్డారు. తాజాగా కన్నబిడ్డను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి ధర్నా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి తన కూతురు కనిపించడం లేదని, ఆమెను తమ గ్రామానికే చెందిన ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా అనుమానం ఉందని… ఈ నెల 9న సదరు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని నాలుగు రోజులుగా వేడుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆ తండ్రి వాపోయాడు. దీంతో ఆదివారం రాత్రి గ్రామస్థులతో కలిసి వచ్చిన బాధిత కుటుంబసభ్యులు కొయ్యూరు స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

కేసీఆర్… నీ పాల‌న ఎలా సాగుతోందో చెప్పడానికి ఇదొక్క‌టి చాలు. బంగారు తెలంగాణ అని ముచ్చట్లు చెప్ప‌డం కాదు. క‌నీసం మ‌హిళల మీద ఇలా అఘాయిత్యాలు జ‌రుగ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చర్య‌లు తీసుకోవాలని బీజేపీ త‌రపున డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు క‌నీస‌ ర‌క్ష‌ణ కూడా క‌రవైంది. తెలంగాణ‌లో వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా కేసీఆర్ నోరు విప్పకపోవడం బాధాకరం. రానున్న రోజుల్లో ఈ మ‌హిళా లోకం కేసీఆర్ స‌ర్కార్‌కు త‌గిన బుద్ధి చెప్పడం ఖాయమని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.