క్లౌడ్ బరస్ట్ కాదు.. మీకు మైండ్ బరస్ట్ అయ్యిందంటూ కేసీఆర్ ఫై విజయశాంతి ఫైర్
క్లౌడ్ బరస్ట్ కాదు.. మీకు మైండ్ బరస్ట్ అయ్యిందంటూ కేసీఆర్ ఫై బిజెపి మహిళానేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్ ఆదివారం భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ప్రతిపక్ష పార్టీల నేతలు పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ మహిళా నేత విజయశాంతి మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్ కాదు కేసీఆర్ గారూ… మీకు మైండ్ బరస్ట్ అయింది అని విమర్శించారు. మీ పరిపాలన వరస్ట్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని.. సీఎంకు మతి భ్రమించినట్టుందని ఎద్దేవా చేశారు. సీఎం వరద ముంపు పర్యటనను చూసి జనాలు నవ్వుకుంటున్నారని , వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, తమను ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని… కానీ ఈ సీఎం అక్కడకు వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని విజయశాంతి అన్నారు. గోదావరికి గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చాయని, అలాగే ఇప్పుడు కూడా వచ్చాయని, భవిష్యత్తులో కూడా వస్తాయని… కానీ, కేసీఆర్ కు మాత్రం ఈ భారీ వర్షాలు మానవ సృష్టిలా కనిపిస్తోందని దుయ్యబట్టారు. పైగా విదేశీ కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. తానే పెద్ద ఇంజినీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్నారని… కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ నీట మునిగిందని అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప… కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేక చోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని చెప్పారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు… విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.