కేసీఆర్ సర్కార్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ విజయశాంతి ట్వీట్

కేసీఆర్ సర్కార్ ఫై మరోసారి బిజెపి నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. వీఆర్ఏలను వేధిస్తున్న కేసీఆర్ సర్కార్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని , కేసీఆర్ ప్రభుత్వం అనేక వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఆగ్రహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలపై పోలీస్ శాఖ నిఘా పెంచిందని మండిపడ్డారు.

పేస్కేల్, అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈనెల 13న వారు చలో అసెంబ్లీ చేపట్టారు. వీఆర్​ఏలను కట్టడి చేయడంలో ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ విఫలమైందని ప్రభుత్వ పెద్దలు సీరియస్​ కావడంతో వారి కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. వీఆర్​ఏల వివరాలను ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. వీఆర్ఏ పేరు, వయస్సు, తండ్రి పేరు/భర్త పేరు, రెసిడెన్షియల్ అడ్రస్​, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఊరు, మొబైల్ నంబర్, కనీసం ఇద్దరు బంధువుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు పోలీసులు సేకరిస్తున్నరు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల వివరాలను పోలీస్ శాఖ సేకరించడం ఎంతవరకు సమంజసం? వీఆర్ఏలను బెదిరింపులకు గురిచేయడం కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. ఏం కేసీఆర్… రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తనని చెప్పి ఈ వేధింపులేంటి? ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. ఈ కేసీఆర్ సర్కార్ కూడా రానున్న రోజుల్లో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని విజయశాంతి అన్నారు.