తెలంగాణ‌ను అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు : విజ‌య‌శాంతి

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని వ్యాఖ్య‌

హైదరాబాద్ : బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌కు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని ఆమె అన్నారు. ”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధ‌నిక‌ రాష్ట్రాన్ని కాస్తా ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి.

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదు. మూడు రాష్ట్రాలకు మాత్రమే రూ.8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు మొగ్గు చూపింది. అందులో తెలంగాణ పేరు లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఏప్రిల్ నెలలో రూ.3 వేల కోట్లు, ఈ నెల 2న రూ.3 వేల కోట్లు అప్పు తీసుకోలేకపోయిన తెలంగాణ.. కనీసం మే 17న రూ.2 వేల కోట్లు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ, రిజర్వు బ్యాంకు చేతులెత్తేయడంతో తెలంగాణలో జూన్ రెండో వారానికల్లా ఇవ్వాల్సిన రైతుబంధు ఆల‌స్యం అవుతుంది. రైతు బంధు కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతుంది.

ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ఇప్పటికే రైతు బంధు చెల్లింపు ఆలస్యమవుతోంది. 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈసారి కూడా మే నెలలో ఇవ్వడం కష్టమే. రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ బాగుప‌డుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా చిన్న దొర పాల్గొన్న ప్రతి ప్రోగ్రాంలోనూ తెలంగాణ సూపర్, బంపర్ అంటూ డబ్బా కొట్టుకోవడం మాత్రం కామ‌న్ అయింది. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక… గప్పాలు పోవడం త‌ప్ప కేసీఆర్ స‌ర్కార్‌కే చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులకుప్ప‌గా చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు” అని విజ‌య‌శాంతి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/