‘మహా’ సంక్షోభంపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు

‘మహా’ సంక్షోభంపై బిజెపి నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు సంతకాలు చేసి ఆ లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపించారు.

ఈ క్రమంలో ‘మహా’ సంక్షోభంపై బిజెపి నేత విజయశాంతి స్పందించారు. ‘మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. సీఎం ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోంది. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ఈ సంక్షోభం రుజువు చేసింది.

లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే శివసేన పార్టీ స్థాపించారు. పొత్తులు,సంకీర్ణ సర్కార్లపై ఆయన గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ‘చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా… దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు’ అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.